కన్నూరు: బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేరళలో పర్యటిస్తున్నారు. ఆయన కన్నూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళలో ఇప్పటివరకు 120 మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. ఆ హత్యలకు సీఎం విజయన్దే బాధ్యత అని విమర్శించారు. ప్రశాంతంగా ఉండే కేరళ.. కమ్యూనిస్టుల పాలన వల్ల హింసాత్మకంగా మారిందని అమిత్ షా అన్నారు. అంతకముందు ఆయన కన్నూరులో హత్యకు గురైన కార్యకర్తల ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అక్కడే ఉన్న రాజరాజేశ్వర ఆలయంలో పూజలు కూడా చేశారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కేరళ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సీఎం విజయన్ స్పందించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయన్ ఆరోపించారు. వరుస ట్వీట్లతో ఆయన బీజేపీ సీనియర్లపై విరుకుపడ్డారు. సీపీఎం అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మావోయిస్టు అని అన్న కేంద్ర మంత్రి జవదేకర్ వ్యాఖ్యలను సీఎం విజయన్ తీవ్రంగా విభేదించారు. కేరళ ప్రజల దేశభక్తిని శంకిస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చేసిన ఆరోపణలపైన కూడా ఫేస్బుక్ మెసేజ్ ద్వారా సీఎం విజయన్ స్పందించారు. ఇవాళ కాసర్ఘడ్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.