ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఓ తండ్రి తన సొంత బిడ్డనే గొంతుపిసికి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రాపుర్లో జరిగింది. మహమ్మద్ తారిక్ అనే వ్యక్తి స్థానికంగా ట్రక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి షాబన్ రజా అనే మూడున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ పసివాడు హీమోఫీలియా అనే జబ్బుతో బాధపడుతున్నాడు. కొడుకు చికిత్స కోసం తారిక్ స్తోమతకు మించి ఖర్చుచేశాడు. ఈ క్రమంలో అప్పులు కూడా చేశాడు. ఇంకా కొడుకు జబ్బు నయం కాలేదు. స్థానిక వైద్యులు ఢిల్లీలోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు.
ఆర్థికంగా చితికిపోయిన తారిక్ కొడుకుని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. యూపీలోని బహేఢీ జిల్లా డాకియాలో ఓ కాలువవైపు కొడుకుతో కలిసి వెళ్లాడు. చిన్నారిని అక్కడే గొంతుపిసికి పొదల్లో పడేశాడు. ఎప్పటిలాగే ఇంటికి తిరిగొచ్చాడు. సాయంత్రానికి చిన్నారి కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఆధారాలతో తారిక్ ను ప్రశ్నించారు. తారిక్ నేరం ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.