చెన్నైలో నేడు జరిగిన శివాజీ మెమోరియల్ ప్రారంభోత్సవ వేడుకకు సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్ లతో పాటు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు. శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు ఆహ్వానం మేరకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చారు. గత సంవత్సరం ఆగస్టు 4న చెన్నై, కామరాజర్ సారైలోని శివాజీ విగ్రహాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు వేరేచోటికి తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన అభిమానుల్లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పబ్లిక్ వర్క్ విభాగం అడయార్ లో సుమారు రూ. 3 కోట్ల ఖర్చుతో 28,300 చదరపు అడుగుల్లో శివాజీ స్మారకాన్ని నిర్మించింది. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ప్రభు స్వయంగా వెళ్లి సీఎం పళనిస్వామిని కోరగా, ఆయన నిరాకరించినప్పుడూ శివాజీ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ముందస్తు కార్యక్రమాల కారణంగా రాలేకపోతున్నానని వివరణ ఇచ్చుకున్న పళనిస్వామి, తన ప్రతినిధిగా పన్నీర్ ను పంపుతున్నట్టు స్వయంగా ప్రభు ఇంటికి వెళ్లి మరీ చెప్పొచ్చారు. ఇక నేటి కార్యక్రమంలో శివాజీ గణేశన్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రజనీకాంత్, అభిమానుల మనసులో ఆయన స్థానం సుస్థిరమైనదని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని కమల్ హాసన్ స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత, రజనీకాంత్ తో కలసి వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.