ఉక్రెయిన్-రష్యా యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఉక్రెయిన్లో ఉండే భారతీయులు నిరంతరం అలర్ట్గా ఉండాలని, ఎవరైనా పని లేకుండా ఉన్న వారు వెంటనే ఇండియాకి వచ్చేయాలని ఆదేశించింది. పని లేకుండా అక్కడ ఉండి ఇబ్బందులు పడేకన్నా సురక్షితంగా ఇండియాకు చేరుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక సర్క్యూలర్ను జారీ చేసింది. ఉద్యోగరిత్యా అక్కడ ఉన్నా నిరంతరం పరిస్థితులను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇండియాకు చెందిన వారు ఉక్రెయిన్లో దాదాపు 18 వేల నుంచి 20వేల మంది వరకు ఉంటారని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులోనూ ఎక్కువగా విద్యార్థులు అక్కడికి స్టడీ కోసం వెళ్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఇక ఉక్రెయిన్ వెళ్లే భారతీయులు కూడా ప్రయాణాల రద్దు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. అక్కడ ఉన్న భారత ఎంబసీకి తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించింది. ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది.
ఇప్పటికే పలు దేశాలు కూడా ఉక్రెయిన్లో ఉండే వారిని అలర్ట్ చేశాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఉక్రెయిన్లో ఉన్న పలు దేశాల ఎంబసీలు కూడా మూత పడ్డాయి. పలు దేశాలకు చెందిన విమాన సంస్థలు కూడా తమ తమ విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నాయి. బోర్డర్లో రెండు దేశాలకు చెందిన సైనికులు డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.