దేశంలోనే రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉండగా....... ఈ విడతలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ స్థానాల్లో 623 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా... 2కోట్ల 27లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ విడత పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో.... 9 మంది మంత్రులు బరిలో ఉన్నారు. 2017 ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇక్కడి 58 స్ధానాల్లో భాజపా ఏకంగా 53 స్ధానాలు గెలవగా...... సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ రెండేసి, రాష్ట్రీయ లోక్ దళ్ ఒకచోట గెలిచాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరగడం, ఈ ఆందోళనలకు నేతృత్వం వహించిన జాట్ వర్గీయుల ప్రభావం పశ్చమ యూపీలో ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు ఎలాంటి ఫలితం రానుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఉదయం..7 గంటలకు ప్రారంభమైన పోలింగ్...... సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.