మహిళలకు కేంద్రం ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ పథక ప్రయోజనం తొలి కాన్పుకు మాత్రమే వర్తిస్తుంది. అయితే రెండో కాన్పుకు కూడా ఈ స్కీమ్ను వర్తింప జేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో కాన్పులో ఆడ పిల్ల పుడితేనే ఈ డబ్బులు అందించాలనే నిబంధన తీసుకురానున్నారు. ఈ స్కీమ్ రూల్స్ని కూడా మార్చేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తోంది.
భర్త ఆధార్ లేకుండానే మహిళలకు డబ్బులు చెల్లించేలా పథకంలో మార్పు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్లో డబ్బులు తీసుకునేందుకు తప్పని సరిగా భర్త ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు అమలైతే ఆ రూల్ను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ కమిటీ ప్రతిపాదనల ప్రకారం రెండో కాన్పుకు కూడా స్కీమ్ బెనిఫిట్స్ కలగనున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల పార్లమెంట్లో తెలిపారు. ఈ పథకం కింద ప్రతీ ఏడాది 51.7 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతోందని వివరించారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు తొలి ప్రసవానికి రూ.5 వేలు అందిస్తోంది. ఇవి మూడు విడతల్లో లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ పథకం వర్తించదు.