న్యూఢిల్లీ: అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలుసుకున్నారు. ఉగ్రసంస్థలకు ఆశ్రయం కల్పించే వారు ఎవరైనా.. వారిని సహించబోమని అమెరికా మంత్రి మాటిస్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు. రెండు దేశాలపై ఉగ్రవాద ప్రభావం ఉందన్నారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచ దేశాలకు ఉన్న ముప్పు తమకు తెలుసు అని మాటిస్ తెలిపారు. హిందూ మహాసముద్ర తీరం చుట్టూ భారత్ ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలను మాటిస్ మెచ్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అయితే ఆఫ్ఘన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇస్తామని, కానీ సైనికులు మాత్రం ఎవరూ అక్కడ అడుగుపెట్టరు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్.. ప్రధాని మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ను కలుసుకుంటారు. అంతకముందు అమర్ జవాన్ జ్యోతి వద్ద మాటిస్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.