వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన పాటిబండ్ల-పెదకూరపాడు మార్గంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ శివనాగరాజు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలానికి చెందిన మహిళ పెదకూరపాడు మండలంలోని ఒక గ్రామంలో సోమవారం సమీప బంధువు దశదిన కర్మకు హాజరయ్యారు. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటోస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ఆమెను గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై పెదకూరపాడు వైపు వెళ్తున్నానని చెప్పాడు.
ఆమె బండిపై కూర్చోగానే ముందుకు కదిలాడు. మార్గమధ్యలో పెదకూరపాడు వెళ్లే మార్గం ఇది కాదుగా అని ఆమె ప్రశ్నించడంతో దగ్గరి దారి అని నమ్మించాడు. మార్గ మధ్యలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అప్రమత్తమయ్యాయరు. ద్విచక్ర వాహనంపై నుంచి దూకి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేస్తూ పరుగు తీశారు. అటుగా వస్తున్న కొందరు ఆమెను రక్షించి నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలో పడేసి పొలాల వైపు పరారయ్యాడు.
ఆమెను రక్షించిన యువకులు విషయాన్ని పెదకూరపాడు సీఐ శివనాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. బాధితురాలికి ధైర్యం చెప్పి వివరాలు తెలుసుకున్నారు. మహిళా పోలీసు సాయంతో పెదకూరపాడు పోలీసుస్టేషన్కు పంపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు వదిలి వెళ్లిన ద్విచక్ర వాహనాన్ని స్టేషన్కు తరలించారు. నిందితుడి కోసం పోలీసులు సమీప గ్రామాల్లో గాలిస్తున్నారు.