సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 1 నుంచి కంపెనీలు బస్తా సిమెంట్ ధర రూ.20 నుంచి రూ.50 వరకు పెంచేశాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాండ్ ను బట్టి ప్రస్తుతం 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.310 నుంచి రూ.410 వరకు పలుకుతోంది. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సిమెంట్ డిమాండ్ అంతగా లేకపోవడంతో బస్తా సిమెంట్ ధర రూ.50 నుంచి రూ.70 వరకు తగ్గించాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిమాండ్ పెరగడంతో కంపెనీలు మళ్లీ ధరలను పెంచేస్తున్నాయి.
సిమెంట్ ఉత్పత్తిలో సున్నపురాయితో పాటు బొగ్గును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండే దిగుమతి చేసుకునే బొగ్గునే కంపెనీలు అధికంగా ఉపయోగిస్తుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర భారీగా పెరిగింది. గతేడాది ఇదే సమయంలో టన్ను బొగ్గు ధర రూ.6,500 లోపు ఉండగా, ప్రస్తుతం రూ.16,000 నుంచి రూ.17,000 వరకు పలుకుతోంది. దీనికి తోడు ప్రధాన ముడి పదార్ధాలు, రవాణా వంటి ఖర్చులు కూడా 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. దీంతో ధరలు పెంచక తప్పలేదని కంపెనీలు చెబుతున్నాయి.