కాటికి కాళ్లు చాచిన వయస్సు లో తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఓ వృద్ధ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేసింది. అంతేకాకుండా తనను కొట్టి ఇంటి నుంచి కూడా గెంటేశాడని,ఈ వయస్సులో తాను ఎక్కడికి వెళ్లి ఎలా బతకాలి అని ఆ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సిటీలోని చకేరీ ప్రాంతంలో ఇద్దరు వృద్ధ దంపతులు నవసిస్తున్నారు. భర్తకు 82 ఏళ్ల వయస్సు కాగా భార్యకు 78 ఏళ్ల వయస్సు ఉంది. అయితే తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని,తనను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని ఆ వృద్ధ మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళ భర్త గణేష్ నారాయణ్ శుక్లా(82), వారి అల్లుడు సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం కుటుంబ కలహాలతో ముడిపడి ఉందని సమాచారం.
వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గణేష్ నారాయణ్ శుక్లా సపోర్టు లేకుండా నడిచే పరిస్థితే లేదు. వృద్ధ దంపతుల కుమారుడు రజనీష్ మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లి ఇప్పటికి కూడా కుటుంబ సభ్యులందరితో చక్కగా ప్రవర్తిస్తుందని,అయితే కొందరు బంధువుల ప్రభావంతోనే ఆమె ఈ కేసు పెట్టినట్లు చెప్పారు. వరకట్నం కేసులో బుక్ అయ్యాడని తెలియగానే తన తండ్రి షాక్ అయ్యాడని రజనీష్ చెప్పారు. ఈ వ్యవహారంపై అడ్వకేట్ శివేంద్ర కుమార్ పాండే మాట్లాడుతూ కుటుంబంలోని సీనియర్ సభ్యులను ఇరికించడానికి వరకట్న చట్టాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. పెళ్లి అయ్యి దశాబ్దాలు గడుస్తున్నా వరకట్న వేధింపుల ఆరోపణలో అర్థం లేదన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించవచ్చని, ప్రస్తుతం ఈ విషయం మధ్యవర్తిత్వంలో ఉందని చెప్పారు.