విజయనగరం: బొబ్బిలిలోని బెర్రీ పరిశ్రమలో ఉన్న సిబ్బంది నివాస సముదాయాల్లో గ్యాస్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి గ్యాస్ కారణమని పోలీసులు భావించడంతో, హెచ్పీ గ్యాస్ యాజమాన్యం కూడా సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. కూలీలు వంట కోసం 11 సిలిండర్లు తీసుకున్నట్లు గుర్తించారు. మంటలు వచ్చిన బండ, రెగ్యులేటర్, పైపులను పరిశీలించారు. ఆదివారం అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రాంతాన్ని చూశారు. జేసీ వెంకటరావు ఆదేశాల మేరకు సోమవారం ఉన్నతాధికారులు రానున్నట్లు అగ్నిమాపక అధికారి సాంబమూర్తి తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నమూనాలను పరిశీలించి ఘటనకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. గాయపడ్డ 13 మందిలో 10 మందిని విజయనగరం, మరో ముగ్గురిని విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో యాజమాన్యం శనివారం చేర్పించింది. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని ఆదివారం విశాఖకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఒకరు మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వరరావు తెలిపారు.