కరోనా మహమ్మారి అంతిమ దశలో ఉందని సంబరపడితే అంతకంటే తెలివితక్కువ తనం మరోటి ఉండదు. కరోనా వైరస్ ఇప్పట్లో అంతమయ్యే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. ఇప్పటికే అనేక వేరియంట్లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఆ మహమ్మారి మరిన్ని కొత్త రూపాలతో విరుచుకుపడే అవకాశాలున్నాయని, ఈ దశలో ప్రజలు అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. కరోనా విషయంలో ఒమిక్రానే చివరి వేరియంట్ అని, ఇక్కడితో ఆ వైరస్ అంతమవుతుందని అనుకోవడమే ప్రమాదకరమని చెబుతోంది. మూడో వేవ్ ఉధృతి ఫిబ్రవరి మూడో వారానికి కల్లా తగ్గుముఖం పడుతుందనే చల్లటి కబురు కూడా చెప్పింది. రానున్న 15 రోజుల్లో థర్డ్ వేవ్ తారస్థాయికి చేరుకుంటుందని, అందుకని అప్రమత్తతో మెలగడం ఎంతైనా అవసరమని సూచిస్తోంది.