భారత్, జపాన్ దేశాలు ఇవాళ పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంటర్నేషనల్ అకాడమిక్ అండ్ స్పోర్ట్స్ ఎక్సేంజ్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీంట్లో భాగంగా నిప్పాన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ నుంచి భారత్, జపాన్ దేశాలు పరస్పరం పనిచేస్తాయి. ఈ సందర్భంగా మోదీ, అబేలు మహాత్మా మందిర్లో జరిగిన కార్యక్రమంలో సంయుక్త ప్రకటన చేశారు. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న అణుపరీక్షలను ఇరు దేశాల ప్రధానులు ఖండించారు. కొరియా అణుపరీక్షలు, మిస్సైల్ పరీక్షలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. 2008లో జరిగిన ముంబై దాడులు, 2016లో జరిగిన పఠాన్కోట్ దాడుల నిందితులకు శిక్షపడే విధంగా పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు డిమాండ్ చేశారు. ఉగ్రవాద అంశంపై మాట్లాడేందుకు మోదీ, అబేలు అయిదవ సారి మళ్లీ భేటీకానున్నారు. సంయుక్త ప్రకటనలో భాగంగా మోదీ జపనీస్ భాషలో అబేకు స్వాగతం పలికారు. గత ఏడాది భారత్లో 4.7 బిలియన్ల డాలర్లు జపాన్ పెట్టుబడి పెట్టినట్లు ఆయన మోదీ చెప్పారు. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఇది 80 శాతం ఎక్కువ అన్నారు.