ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు ఆరు గురు భారత మహిళా నావికులు చేపట్టనున్న ‘నావికా సాగర్ పరాక్రమ్’యాత్ర ఆదివారం ప్రారంభమైంది. గోవాలోని పణజిలో మందోవీ బోట్పూల్లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ఇది ఐదు, పదేళ్లకు ఓసారి జరిగే సంఘటన కాదు. భారత నావికాదళ చరిత్రలోనే ఇది చారిత్రాత్మకమైన రోజు. ప్రపంచంలో ఏ నావికులు కూడా ఊహించని సాహసయాత్రకు భారత మహిళలు సిద్ధమయ్యారు’అని నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో నౌకాదళం చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పాల్గొన్నారు. మరోవైపు భారత మహిళా నావికులు చేపడుతున్న ప్రపంచ యాత్ర విజయవంతం కావాలని దేశమంతా కోరుకుంటోందని ప్రధాని మోదీ ట్వీటర్లో తెలిపారు.