ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించబోయేది ప్రజా రాజధాని ముమ్మాటికీ కానే కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అవినీతి చేస్తూ ఆ సొమ్మంతా తన ఖజానాకు తరలించుకుంటున్నారని ఆర్కే అన్నారు. ఇప్పటికీ రాజధానికి ఏడుసార్లు శంకుస్థాపన చేశారని, కార్యక్రమానికి ప్రధాని మోదీ, అరుణ్ జైట్లీ కూడా హాజరయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పవిత్ర స్థలాల నుంచి మట్టి తెచ్చి హడావుడి చేశారే తప్ప.. నిర్మాణ విషయంలో ఎలాంటి పురోగతి లేదంటూ మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో ఫోటోలో ఆర్కే చూపించారు.
ఇక ఈ ప్రాంతం రాజధానిగా పనికి రాదని శివరామకృష్ణ కమిటీ తేల్చేసిందని, అప్పటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్టారావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మేధావులు, అనుభవజ్జుల మాటలు చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు వెళ్లారని, ప్రశ్నించిన నీతివంతులైన అధికారులను తప్పించి ఆ స్థానంలో అవినీతి ఆరోపణలు ఉన్న నేతలను నియమిస్తున్నారంటూ ఆర్కే ఆరోపించారు. దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాధారణ ప్రజల దగ్గరి నుంచి అధికారుల దాకా ఏనాడూ ఆయన నిర్ణయాన్ని వేలెత్తి చూపిన దాఖలాలు లేవు. కానీ, బ్యూరోక్రసీకి పెద్ద అయిన సీఎస్ పదవి నిర్వహించిన ఐవైఆర్ లాంటి అధికారి చంద్రబాబు పనితీరును తప్పుపట్టడం గుర్తించాలని ఆర్కే ప్రజలను కోరారు. రాజధాని కోసం పేద ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ల్యాండ్ పూలింగ్ పేరిట 33 వేల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆర్కే తెలిపారు. 9 నగరాలంటూ చెప్పిన చంద్రబాబు అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం చేయకూడని పని చంద్రబాబు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై శ్వేత పత్రం విడుదల చేసి సీబీఐతో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కానీ పక్షంలో న్యాయ స్థానాలే జోక్యం చేసుకోవాలంటూ ఆర్కే విజ్ఞప్తి చేశారు.