ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆరుగురు సభ్యుల కమిటీ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వం వహిస్తున్నారు.
కమిటీ కీలక నిర్ణయాలు బుధవారం (8వ తేదీ) వెలువడతాయి. అయితే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని (2-6 శ్రేణిలో) అదుపులో ఉంచుతూ, బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) యథాతథ పరిస్థితికే ఆర్బీఐ మొగ్గు చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ పర్యవసానాలు ఈ అంచనాలకు తాజా కారణం. యథాతథ రెపో రేటు విధానం కొనసాగిస్తే, ఈ తరహా నిర్ణయం వరుసగా ఇది తొమ్మిదవసారి అవుతుంది. 2019లో రెపో రేటును ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్ పాయింట్లు 1%). 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పార్లమెంటులో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెడుతుండడం తాజా సమావేశాల మరో కీలక నేపథ్యం కావడం గమనార్హం.