ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలాఖరులోగా ఘాట్‌ రోడ్‌ మరమ్మతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 04, 2021, 12:48 PM

భారీ వర్షాల కారణంగా తిరుమల అప్‌ ఘాట్‌ రోడ్డులో రోడ్డు ధ్వంసమైన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసంకావడంతో పాటు రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రస్తుతం టీటీడీ అధికారులు పునఃనిర్మాణ పనులపై దృష్టిసారించారు. యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి నిర్మాణ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ధ్వంసం కావడంతో ప్రస్తుతం తిరుమలకు వెళ్లే వాహనాల రాకపోకలు డౌన్‌ ఘాట్‌ రోడ్డు నుంచే సాగుతున్నాయి. అయితే ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండడంతో మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు పునఃనిర్మాణం విషయమై తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు.


అప్ ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియలోని మిగిలిన భాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల భద్రతే ముఖ్యమని.. ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com