ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ బిసి కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసారని తూర్పునియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో కల 22 వ డివిజన్ లో శుక్రవారం పర్యటించిన ఆయన స్థానికులను మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ లో ఓ నిరుపేద కుటుంబానికి జీవనోపాధి నిమిత్తం ఇస్త్రీ బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో బిసి కార్పొరేషన్ ద్వారా అనేక మంది బిసిలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు. ఒక్క బిసిలకె కాకుండా ఎంతో మందికి జీవనోపాధి నిమిత్తం ఎన్నో ఉపకరణాలు అందజేసామని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. బిసి కార్పొరేషన్ అడ్రెస్ లేకుండా పోయిందన్నారు. అలాగే వైసీపీ నాయకులు ఇసుక అక్రమంగా బయట ప్రాంతాలకు తరలించి అమ్ముకోవడం వల్లనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది పేర్కొన్నారు. సామాన్య ప్రజలు రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేదన్నారు. రోజువారీ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలోచనా రహిత పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రాహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.