ఉత్తరాంధ్రకు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు.
లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుఫాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్ కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుఫాన్ సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు స్వీకరించాలని సీఎం జగన్ ఆదేశించారు.