కరోనా సెకండ్ వేవ్ కేరళ రాష్ట్రాన్ని బాగా ప్రభావితం చేసింది. ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కరోనా బారినపడిన వారిలో 41 మంది గర్భిణీలు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైరస్ సోకిన వారిలో 149 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. బుధవారం కేరళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి వీణా జార్జ్ ప్రశ్నోత్తరాల సమయంలో సభకు వెల్లడించారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు టీజే వినోద్ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 'జిల్లాల నుండి అందిన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో 41 మంది గర్భిణీలు కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయారు. వైరస్ బారినపడిన 149 మంది రోగులు ఆత్మహత్య చేసుకున్నారు' అని ఆమె పేర్కొన్నారు.