ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2017, 08:17 AM

నెల్లూరు జిల్లాలో వరస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌ వెంకటేశ్వర్లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు నెల్లూరు నాలుగో అదనపు కోర్టు గురువారం (ఆగస్టు 17) తీర్పు వెలువరించింది. 2016లో హరినాథపురంలో ఆడిటర్ భార్య ప్రభావతితో పాటు, పూజారి దంపతులను వెంకటేశ్వర్లు సుత్తితో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు తుది తీర్పును వెలువరించింది. అమాయకుడిగా కనిపిస్తూనే కిరాతకంగా ప్రాణాలు తీయడం వెంకటేశ్వర్లు నైజం. నెల్లూరు జిల్లాలో గత ఏడాది ఇతడు నలుగురిని హత్య చేశాడు. అప్పట్లో ఈ వరస హత్యలు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించాయి.


వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్ నేపథ్యం పరిశీలించగా పలు ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగుచూశాయి. నెల్లూరులోని యర్రబొట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్.. ఏపీ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అతడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా పని చేశాడు. 2014 ఎన్నికల పాదయాత్ర సమయంలో చంద్రబాబుతో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రాంగోపాల్ వర్మ సినిమాలను చూసి ఆ హత్యలు, దోపిడీలకు పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.


పగలు కూలీ పనులు చేస్తూనే.. రాత్రి దోపీడీలకు పాల్పడిన వెంకటేశ్‌ను గుర్తించడం అప్పట్లో పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా వారి ఇళ్లలోకి ప్రవేశించి సుత్తితో తలపై మోది హత్యలు చేసేశాడు. నిత్యం రద్దీగా ఉండే చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో దోపిడీకి పాల్పడి ఓ మహిళను దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత నెల్లూరు నగరంలో సాయినగర్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటి యజమానురాలు ప్రభావతి(55), వారి పిల్లలు మాధురి, అనంత కృష్ణపై దాడి చేసి సుత్తితో తలపై మోదాడు. దీంతో వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.


వెంకటేశ్ వారి వద్ద ఉన్న బంగారు నగలు, సెల్‌ఫోన్లను చోరీ చేస్తుండగా.. ఇంటి యజమాని నాగేశ్వరరావు వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న భార్య ప్రభావతి, పిల్లలను చూసి వారి దగ్గరకు వెళుతుండగా వెంకటేశ్.. ఆయనపై కూడా దాడికి దిగాడు. నాగేశ్వరరావు అత్యంత సాహసోపేతంగా అతణ్ని పట్టుకొని కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు వచ్చి అతణ్ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన భార్యా పిల్లలను ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రభావతి మరణించారు.


అనంతపురం జిల్లా హిందూపురంలోనూ సైకో వెంకటేశ్వర్లుపై పలు కేసులున్నాయి. కావలి, పెద్దచెరుకూరులో మూడు హత్యలు చేసింది కూడా ఈ సైకో కిల్లరే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం మీద ఏడాది లోపే నిందితుడికి శిక్ష ఖరారు కావడంతో బాధితుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com