నీలగిరి జిల్లాలో నలుగురిని చంపిన డి23 పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు అభినందించింది. ఇటీవల ఈ పులి స్థానికంగా కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ పులి చేతిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ పులిని కాల్చి చంపాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే, యూపీ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన సంగీతా డోక్రా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పీపుల్ ఇన్ కేట్టిల్ ఆఫ్ ఇండియా కూడా మరో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. పులిని వేటాడే ముందుగా ప్రాణాలతో పట్టుకునేందుకు ఉన్న అన్ని చర్యలను తీసుకోవాలని సూచన చేసింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఆ పులిని ప్రాణాలతో పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించి సఫలీ కృతులయ్యారు. మత్తు సూదిని అమర్చిన గన్తో పులిని కాల్చడంతో అది స్పృహ కోల్పోయింది. ఆ వెంటనే పులిని బోనులో ఎక్కించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ గురువారం జరుగగా, పులిని ప్రాణాలతో పట్టుకుని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తులు అటవీ అధికారులను అభినందించారు.