ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన బద్వేలు ఎన్నికల్లో గెలుస్తామని చెప్పే దమ్ము పవన్ కి ఉందా అంటూ ప్రశ్నించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని ఎలా నడిపించాలో కూడా చేతకాని పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
బద్వేలు ఉపఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో వైసీపీ విజయం సాధిస్తుందని ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఈ ఎన్నికతో వైసిపి కంచుకోట బద్వేల్ అని మరోమారు రుజువు కాబోతుందని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ది కోసం ప్రతిసారి కులాల మతాల ప్రస్తావన తీసుకు వస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, జగన్ పై ద్వేషం, ఈర్ష తో పవన్ మాట్లాడుతున్నాడని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కడుపుమంటకి మందు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ తన దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏమైనా తిట్టొచ్చా? కానీ ఆయనకు మేము సమాధానం చెప్తే దాడులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేశారని, దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చంద్రబాబు డైరెక్షన్ లోనే యాక్షన్ చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.