టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని, దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. టీటీడీ స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.