ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో బ్యాంకుకు ఆర్బీఐ పెనాల్టీ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 16, 2021, 12:31 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మర్యాదిత్‌కు లక్ష రూపాయల జరిమాని విధించింది. నో యువర్‌ కస్టమర్ (కైవైసీ) నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది. అలాగే మంగళవారం ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం కో ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకుకు ఆర్బీఐ రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందున ఈ జరిమానా విధించింది. ఆదాయం గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులు, ఇతర అంశాలపై మాస్టర్‌ సర్క్యూలర్‌, పట్టణ సహకార బ్యాంకుల డైరెక్టర్ల బోర్డుపై మాస్టర్‌ సర్క్యూలర్‌ ఉల్లంఘనలపై ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది.


ఆర్బీఐ విధించిన ఈ జరిమానా అంశం వినియోగదారుల లావాదేవీలపై ఏ మాత్రం ప్రభావం చూపదని ఆర్బీఐ అధికారులు తెలిపారు. కాగా, ఇదే నెలలో రెండు బ్యాంకులకు పెనాల్టీ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన ముంబై మెర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.50 లక్షల జరిమానా విధించింది. అలాగే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఉన్న సెంట్రల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్ కేవైసీ నిబంధనలు పాటించనందున రూ.2 లక్షల జరిమానా విధించింది. అయితే బ్యాంకులకు జరిమానా విధించడం వల్ల కస్టమర్ల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. సహకార బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటు, 2016, ఫ్రేమ్‌ వర్క్‌ కింద ఆదేశాలు పాటించనందున ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.


ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ కోల్‌కతాలోని విలేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు కేవైసీ నిబంధనలు పాటించనందున రూ.5 లక్షల జరిమానా విధించింది. అహ్మద్‌నగర్‌ మర్చంట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.13 లక్షలు, అహ్మదాబాద్‌లోని మహిళా వికాస్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. గత నెలలో ఆర్బీఐ నాసిక్‌లోని జనలక్ష్మి కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.5.35 లక్షలు జరిమానా విధించగా, ఘజియాబాద్‌లోని నోయిడా కమర్షియల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.3 లక్షల జరిమానా విధించింది. నాసిక్‌లోని జనలక్ష్మి కో-ఆపరేటివ్‌ బ్యాంకు నిబంధనలు పాటించనందున జరిమానా విధించినట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com