సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఎవరు గొప్ప కెప్టెన్ అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన దృష్టిలో గంగూలీ, ధోని ఇద్దరూ గొప్ప కెప్టెన్ లని, ఎవరికి వారే ప్రత్యేకమని కొనియాడాడు. అయితే గంగూలీ భారత జట్టును ఏకతాటిపైకి తెచ్చాడని, నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత్ ను కొత్తగా తీర్చిదిద్దాడని చెప్పాడు. ఈ క్రమంలోనే భారత జట్టు విదేశాల్లో ఎలా గెలవాలో రుచిచూపించాడని తెలిపాడు. ఇక ధోనీ విషయానికి వస్తే.. అతడు కెప్టెన్సీ చేపట్టే సమయానికే భారత్ గొప్ప జట్టుగా ఉందని, అది అతడికి కలిసొచ్చిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ధోనీకి కొత్త జట్టును తయారుచేయడంలో పెద్ద కష్టం కాలేదన్నాడు. ఇద్దరూ గొప్ప కెప్టెన్ లని చెప్పాడు. కానీ, తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు గంగూలీనే అత్యుత్తమ సారథి అని స్పష్టం చేశాడు.