రక్షణేది.. కాపాడేదెవరూ...? అమ్మాయిలుగా పుట్టడమే తప్పా..? ఉరి.. ఎన్కౌంటర్లే పరిష్కారాలా..? ఇప్పుడు.. ఇవే అందరి మెదళ్లల్లో సుడులు తిరుగుతున్న ప్రశ్నలు. వీటికి ఇప్పట్లో సమాధానం దొరికే అవకాశం కూడా లేదు. అంతగా సమాజం.. దిగజారిపోయింది.
పసిపిల్లలు అని కూడా చూడకుండా అత్యాచారం చేసి.. వారిని కాటికి పంపిస్తున్న మృగాళ్లు నానాటికి పెరిగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆరేళ్ల పసిపిల్ల హత్యాచార ఘటన సంచలనంగా మారింది. దీనిపై ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు.
ఈ నేపథ్యంలో అత్యాచారాలు చేసే నిందితులకు ఉరి శిక్ష వేయాలని, ఎన్కౌంటర్ చేయాలనే రకరకాల వాదనలు, ఆలోచనలు తెరపైకి వచ్చాయి. అలా చేస్తేనే భయం వస్తుందనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలా ఎన్ కౌంటర్లు కూడా జరిగాయి. కానీ ఎక్కడా అత్యాచారాలు ఆగిన దాఖలాలు లేవు. పైగా పెరుగుతున్నాయి. మరీ ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లె పరిష్కారం ఎలా అవుతాయని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.
ఆడపిల్లలు ఆనందంగా, భద్రంగా ఉండాలంటే సమస్యని అంతం చెయ్యాలి.. ప్రాణం తీసే ఆయుధానికి శిక్ష వెయ్యకూడదు.. ఆ ఆలోచనకి శిక్ష పడాలని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు. చెత్త సినిమాలు.. పోర్న్ వీడియోస్… మనుషుల మెదళ్లను తుప్పు పెట్టేలా చేస్తున్నాయి. విలువల గురించి తెలియజేయని విద్య, విచ్చలవిడిగా అందుతున్న మద్యం, ఆడపిల్లలపై వుండే చిన్న చూపు... అత్యాచారాలకు కారణం అవుతున్నాయని మహిళా సంఘ నేతలు అంటున్నారు. ఈ మూలాల్లో మార్పు రానంత వరకూ ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు తాత్కాలిక ఆవేశాలను చల్లార్చడానికే తప్ప.. సమస్య పరిష్కారానికి దోహదపడవని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. మూలాల్లో మార్పు రానిదే.. నిందితులకు ఎలాంటి శిక్ష విధించినా.. అత్యాచారాలు రీపీట్ అవ్వుతూనే ఉంటాయి.