ఏపీలో పింఛన్లను ప్రభుత్వం తనిఖీ చేస్తోంది. నిబంధనలకు అనుగుణంగా లేని వారికి నోటీసులు జారీ చేస్తోంది. గత మూడు నెలలుగా వివిధ తనిఖీ చేస్తూ ఏ మాత్రం అనుమానం ఉన్నా సాయాన్ని నిలిపేస్తోంది. గత నెలలో ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను విధానాన్ని అమలు చేసి రెండు పింఛన్లు ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఆధార్ కార్డులో వయసు తేడాలు ఉన్నాయంటూ మరికొందరికి అదే నెల నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆరంచెల తనిఖీ వ్యవస్థకు అనుగుణంగా లేవంటూ లబ్ధిదారులకు వాలంటీర్లు నోటీసులు ఇస్తున్నారు. ఈ నెల 8, 9న ఈ జాబితాను క్షేత్రస్థాయికి పంపి లబ్ధిదారుల నుంచి అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు సేకరించారు. ఇంకా ఇవ్వని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. 2019 డిసెంబర్ 13న జారీ చేసిన 174 ఉత్తర్వుల్లో పింఛను నిబంధనలకు అనుగుణంగా లేనట్లు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు.
పింఛను సంఖ్యను నమోదు చేసి వ్యక్తిగత, కుటుంబ వివరాలు పరిశీలించామని, దారిద్య్ర రేఖకు ఎగువగా ఉన్న కుటుంబం భూమి ఎక్కువగా ఉంది, 800 యూనిట్ల కంటే అధిక విద్యుత్తు వినియోగం, బియ్యం కార్డు లేకపోవడాన్ని గుర్తించామంటున్నారు. అందుకే పింఛను తాత్కాలికంగా నిలిపేస్తున్నామంటున్నారు. తాఖీదు అందుకున్న 7 రోజుల్లో వివరణ రాత పూర్వకంగా తెలియజేస్తూ సంబంధిత పత్రాన్ని మండల కార్యాలయానికి అందించాలి. పింఛను పొందేందుకు ఉన్న అర్హతను తగు ఆధారాలతో నిరూపించుకోవాలి. లేకపోతే శాశ్వతంగా రద్దు చేస్తామని నోటీసుల్లో ప్రస్తావిస్తున్నారు. వీటిని ఎంపీడీవో నుంచి జారీ చేసినట్లు ఉన్నా సదరు అధికారి సంతకం మాత్రం లేదు. సంతకం అవసరం లేదని నోటీసుల్లో ప్రస్తావించారు.