పెళ్లైన 55 రోజులకే ఓ యువతి తన భర్తకు షాకిచ్చింది. తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో సదరు భర్త, అతని కుటుంబం కంగు తిన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బర్మార్కు చెందిన పంకజ్ కు పూజ అనే యువతితో 55 రోజుల క్రితం వివాహం జరిగింది. పూజ పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే భర్తకు గుడ్ బై చెప్పి తన ప్రియుడితో వెళ్లిపోయింది. అయితే పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పూజకు పంకజ్ తో పెద్దలు బలవంతంగా రెండో పెళ్లి చేశారని తెలిసింది. అప్పటికే ఆమె ఓ యువకుడిని ప్రేమించిందని, అతనితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో పూజ, ఆమె ప్రియుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకోగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరూ ఎక్కడ ఉన్నారో కనుక్కుని పూజను ఆమె ప్రియుడి నుంచి విడదీసి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే పంకజ్తో వివాహం చేశారు. పూజ ప్రేమ పెళ్లి గురించి దాచి ఈ పెళ్లి చేశారు.
అయితే ప్రియుడిని మర్చిపోలేకపోయిన పూజ భర్తను భరిస్తూ 55 రోజులు కాపురం చేసింది. ఇక తన వల్ల కాదని, తనను తీసుకెళ్లిపోవాలని పూజ తన ప్రియుడికి సమాచారం అందించింది. పూజ తన అత్త కళ్ల ముందే ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఎప్పుడూ తలుపు దగ్గర అంతసేపు నిల్చోని తన కోడలు వాకిలి దగ్గర నిల్చుని బయటకు చూస్తూ ఉందని.. తన భర్త కోసం చూస్తుందేమోనని తాను అనుకున్నానని పూజ అత్త చెప్పింది. కానీ ఇంతలో ఓ కారు వచ్చి ఆగడంతో పూజ ఆ కారు ఎక్కి వెళ్లిపోయిందని పూజ అత్త తెలిపింది.