ఓ 10 ఏళ్ల పిల్లాడు అదృశ్యం అయిన కేసులో షాకింగ్ విషయాలను పోలీసులు బయటపెట్టారు. బాలుడి తల్లిదండ్రులతో పాటుగా తండ్రి ప్రేయసిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సునీల్ కుమార్(30) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సింధు(26) ఓ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న నదియాతో సునీల్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో సునీల్, సింధుకు మధ్య గొడవలు జరిగాయి. అయితే ఫిబ్రవరి 7న తన కొడుకు మాట్లాడిన మాటలు సునీల్ కు కోపం తెప్పించాయి. దీంతో సునీల్ క్షణికావేశంలో తన కొడుకును హత్య చేశాడు. ఆ సమయంలో నదియా అక్కడే ఉంది. సింధు ఇంటికి తిరిగివచ్చాక జరిగిన విషయాన్ని ఆమెకు చెప్పారు.
ఈ ఘటన నుంచి తనను కాపాడాలని సునీల్ తన భార్య సింధును వేడుకున్నాడు. తాను నదియాకు దూరంగా ఉంటానని చెప్పాడు. ఇందుకు అంగీకరించిన సింధు.. ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి పిల్లాడి శవాన్ని బెడ్ షీట్లో చుట్టి అటవీ ప్రాంతంలో పడవేశారు. ఇంట్లో బాలుడు మిస్సింగ్ అయినట్టు సింధు, సునీల్లు చెప్పారు. కానీ వారు బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులను ఆశ్రయించలేదు. రోజులు గడుస్తున్న బాలుడి ఆచూకీ లభించకపోవడంతో సింధు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయమని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సునీల్ ఆగస్టు 26వ తేదీన పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి తన కొడుకు కనబడటం లేదని చెప్పాడు.
కొడుకు కనిపించకుండా పోయిన 6 నెలల తర్వాత సునీల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అనుమానాలొచ్చాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం సేకరించారు. నదియాతో సునీల్కు వివాహేతర సంబంధం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే సునీల్ బాలుడి మిస్సింగ్ గురించి పొంతన లేని విధంగా మాటలు చెప్పాడు. దీంతో పోలీసులు సునీల్, నదియాలను విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సునీల్, నదియా, సింధులను అరెస్ట్ చేశారు.