ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని రాపురులో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి రాపురులో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజలు తమకు అవసరమైన వస్తువులు, సామాగ్రిని తీసుకెళ్లాలని అన్నారు.
ఒకటి దాటిన తరువాత రోడ్డుపై ఎవరు కనిపించినా.. జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని, లేదంటే ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని హితవుచెబుతున్నారు. ఒకవేళ అత్యవసర పనులమీద బయటకు వెళ్లినా మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు అధికారులు.