ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో పథకం కింద అర్హులందరికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఈ నెల 10న నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.24వేలు జమ చేయనున్నట్లు ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు తెలిపారు.
విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నేతన్న నేస్తం లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అధికారులు జిల్లాల వారీగా అర్హులు, అనర్హుల జాబితాలను రూపొందించారని.. ఏ కారణంగా వారిని అనర్హులుగా పరిగణించారన్న విషయాన్ని స్పష్టంగా వివరించామన్నారు. చేనేతల సంక్షేమంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే గడిచిన రెండేళ్లలో నేత కార్మికుల సంక్షేమం కోసం సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. చేనేతలకు ఆర్ధిక బాధల నుంచి విముక్తి కల్పించాలన్న సదుద్దేశ్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారని, ఆయన ఆశయాలను నెరవేర్చడంలో భాగంగా అర్హులైన నేత కార్మికులను గుర్తించి నేతన్న నేస్తం వర్తింపజేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ నెల 7న చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. వారం రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.