భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్ చేరి సత్తా చాటింది. క్వార్టర్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసిన రాణి సేన.. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా దెబ్బకొట్టింది. ఇటు స్ట్రైకర్లు.. అటు డిఫెన్స్ టీం చక్కగా రాణించడంతో గెలుపు భారత్ సొంతమైంది. తద్వారా 41 తర్వాత తొలిసారి క్వార్టర్స్ ఫైనల్కు చేరి అంచనాలను పెంచిన మహిళా జట్టు.. వాటిని నిజం చేస్తూ సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టింది.
ఇక గుర్జీత్ కౌర్ ఈ మ్యాచ్లో భారత్కు తొలి, ఏకైక గోల్ను అందించి ప్రత్యేకంగా నిలిచింది. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా, హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్క్రమించడం గమనార్హం. ఇక క్వార్టర్స్కు ముందు పూల్ 'ఎ'లో భారత్ లీగ్ దశలో రెండు మ్యాచ్ల్లో గెలిచి, మూడింటిలో ఓడింది. ఏడు గోల్స్ చేసి, 14 గోల్స్ సమర్పించుకుంది. మరోవైపు పూల్ 'బి'లో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచిన సంగతి తెలిసిందే.