అక్రమ సంబంధాలు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఎదిగిన కొడుకు ఉండగానే మరో వ్యక్తితో సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ భార్య తన భర్తను హత్య చేసింది. కానీ ఎవరికి తెలియకుండా ఆయన గుండెనొప్పితో చనిపోయాడని డ్రామాలు ఆడి చివరికి పోలీసులకు చిక్కింది. కోడలితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ తండ్రి.. సొంత కొడుకును హతమార్చాడు.. ప్రేయసి మోజులో కట్టుకున్న భార్యను అంతమొందించాడు ఓ భర్త.. తమ సంబంధానికి అడ్డు వస్తున్నారని.. ప్రియుడితో కలిసి కన్న బిడ్డలను హత్య చేయించిన తల్లి.. ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. క్షణిక సుఖం కోసం కొందరు హద్దులు దాటుతున్నారు. పెళ్లి తరువాత కూడా పరాయి మోజులో సొంత వారిని.. బంధాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. భార్య లేదా భర్త చేసిన తప్పులకు.. వారి కోరికల కోసం పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అయినా అవేవీ ఆలోచించడం లేదు. మరికొందరు అయితే అనుమానపు జబ్బుతో హత్యలు చేస్తున్నారు. కుటుంబాల్లో కన్నీటిని నింపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్ల పాలెంలో దారుణం జరిగింది. కోడలిని అతి కిరాతకంగా సొంత మామే హత మార్చాడు. కోడలిపై అనుమానంతో ఇంట్లో కత్తి తీసి అతి కిరాతకంగా హత్య చేశాడు మామ సత్యనారాయణ. 23 ఏళ్ల చొప్పల ప్రియకు కొంతకాలం క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్న ఆమె భర్త.. అయితే తాను గల్ఫ్ లో ఉండడంతో భార్యను తన తల్లిదండ్రుల దగ్గరే ఉంచి వెళ్లాడు.మేడిచెర్ల పాలెంలో అత్త, మామతో కలిసి ఉంటోంది కోడలు ప్రియ, అయితే ఇటీవల ఆమె ప్రవర్తనపై మామకు అనుమానం వచ్చింది. పదేపదే ఫోన్లు మాట్లాడుతుండడం.. కోడుకుతో అని చెప్పి వేరే వారితో మాట్లాడడం.. చెప్పకుండా బయటకు వెళ్లి వస్తు ఉండడంతో అనుమానం పెంచుకున్నాడు. కొడుకు లేకపోవడంతో కోడలు మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. కోడలిని హత్య చేసిన తరువాత మామయ్య మలికిపురం పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు పోలీసులు. ప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.. మామను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.