కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్కు సంబంధించి చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పది మంది పార్టీ నేతలతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు రేపు ఉదయం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలను పరిశీలించనున్నారు.
ఈ నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీలో సభ్యులుగా ఉన్న నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తదితరులను గృహనిర్బంధంలో ఉంచారు. వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లేందుకు గుంటూరులోని ఆయన ఇంటి నుంచి బయలుదేరిన ఆనందబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేటను మూసివేశారు. పోలీసుల తీరుపై నక్కా ఆనందబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి వచ్చి తలుపులు వేసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు.