బీజింగ్: చైనా ఎప్పుడూ తమ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టంచేశారు. మంగళవారం ఆర్మీ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యంగా డోక్లామ్ ప్రాంతంలో ఇండియాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన కామెంట్స్కు ప్రాధాన్యత ఏర్పడింది. చైనా ప్రజలు శాంతినే కోరుకుంటారు. దూకుడుగా ఉండటం, రాజ్యాన్ని విస్తరించే ఆలోచనలు మాకు లేవు. కానీ మా భూభాగంలో చొరబాట్లను తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. మా భూభాగం నుంచి చిన్న భాగాన్ని కూడా విడదీసే అవకాశం ఎవరికీ, ఎప్పటికీ కల్పించం అని జీ జిన్పింగ్ తేల్చి చెప్పారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో జీ పాల్గొన్నారు. తమ సార్వభౌమాధికారానికి హాని కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని జీ స్పష్టంచేశారు. పీఎల్ఏ సంబరాల్లో చైనాతోపాటు ఇండియా, భూటాన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 1962 యుద్ధం తర్వాత నెల రోజులకు పైగా ఇండోచైనా మధ్య ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారి. డోక్లామ్లోకి భారత బలగాలే చొచ్చుకొచ్చాయని చైనా ఆరోపిస్తుండగా వివాదాస్పద ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామని భారత్ వాదిస్తున్నది. ఓవైపు ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ఉత్తరాఖండ్లోని బారాహోతిలోకి 50 మంది చైనా సైనికులు దూసుకు రావడం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలహీనం చేసింది.