విశాఖ జిల్లా యలమంచలి పట్టణానికి సమీపంలో కొత్తపాలెం చెరకు కాటా వద్ద బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు అదుపు తప్పి పంటపాలాల్లోకి దూసుకెళ్లిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పొందారు. పట్టణానికి చెందిన నలుగురు యువకులు అచ్యుతాపురం సెజ్ లో ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరంతా విధులు నిర్వహించే నిమిత్తం యలమంచిలి నుంచి అచ్యుతాపురం వెళ్తున్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే కొత్తపాలెం కాటా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సమీపంలో పంటపొలాల్లోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో యలమంచిలి పట్టణానికి చెందిన కొఠారు రవితేజ, ఎన్ రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని విశాఖ డెయిరీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్టు యలమంచిలి పట్టణ ఎస్సై సిహెచ్ నర్సింగరావు విలేకరులకు తెలిపారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీలో శవపరిక్ష నిమిత్తం భద్రపరిచారు మృతులిద్దరూ అవివాహితులే కావడం, కుటుంబాలకు ఆసరా కావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవిందు మృతుల కుటుంబీకులు పరామర్శించి ఓదార్చారు. యలమంచిలి పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.