న్యూయార్క్: కోడి, జంతు మాంసాలు జంతు ఉత్పత్తులను తరచూ తినేవారిలో మధుమేహం వచ్చే ముప్పు రెండింతలు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. స్పెయిన్కు చెందిన రొవిరా-ఐ-విర్జిల్ యూనివర్సిటీ పరిశోధకులు జంతు సంబంధ ఆహార పదార్థాలకు, మధుమేహానికి మధ్య సంబంధంపై ఇటీవల అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా కొంతమంది ఆరోగ్య పరిస్థితిని నాలుగేళ్లపాటు పరిశీలిస్తూ వచ్చారు. వీరిలో కాయగూరల భోజనం చేసేవారి కంటే, మాంసం ఎక్కువగా తినేవారే రెట్టింపు సంఖ్యలో చక్కెర వ్యాధికి గురికావడం గమనార్హం. ‘‘నిత్యం ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఆహారంలో ఎక్కువపాళ్లు కాయగూరలు ఉండేలా చూసుకోవాలి. మాంసకృత్తులు ఉండే పదార్థాలను మితంగానే తీసుకోవాలి. వంట నూనెగా ఆలివ్ ఆయిల్ను వాడుకుంటే మంచిది’’ అని శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు.