అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పీడీ3లోని గులే దవాఖానా ప్రాంతంలో ప్రముఖ రాజకీయ నాయకుడు మహ్మద్ మోహాఖిక్ ఇంటికి సమీపంలో ముష్కరులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఘటనను అఫ్గాన్ హోంమంత్రిత్వ శాఖ నజీబ్ దానిశ్ ధ్రువీకరించారు. కీలక రాజకీయ నాయకుల నివాసాలు ఉన్న చోట పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. కాగా.. అఫ్గాన్లో తాలీబన్ ఉగ్రవాదులు తరచుగా దాడి చేస్తుండటం గమనార్హం.