పెళ్లైన తొలిరాత్రే వరుడిని ఐరన్ రాడ్డుతో తలపై కొట్టి డబ్బు, నగలతో వధువు పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని హరిద్వార్ కు చెందిన యువతికి బింజోర్ లోని కుండా ఖుర్ద్ కు చెందిన యువకుడికి మార్చి 15 న పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వరుడు తనతో ఏడడుగులు నడిచిన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. తొలి రాత్రే ఆ భార్య తనను కట్టుకున్న భర్తపై ఐరన్ రాడ్డుతో దాడి చేసింది. దీంతో అతడు పెద్దగా కేకలు వేశాడు. బంధువులు గదిలోకి వచ్చేసరికి ఆమె పారిపోయింది. గాయపడిన వరుడిని బంధువులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి వరుడు మాట్లాడుతూ.. "ఆ రోజు నా భార్య నాపై సడన్గా దాడి చేసింది. దీంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆమె బంగారు నగలతో పాటు రూ.20 వేలు తీసుకుని పారిపోయిందని తర్వాత తెలిసింది" అని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కోసం గాలిస్తున్నారు.