ఢిల్లీ: ఆర్థిక సంవత్సరాన్ని ప్రస్తుతమున్న ఏప్రిల్ నుంచి మార్చికి బదులుగా జనవరి నుంచి డిసెంబర్కు మార్చాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో వెల్లడించారు. ఆర్థిక మాజీ సలహాదారుడు శంకర్ ఆచార్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందం ఆర్థిక సంవత్సర మార్పులపై క్షేత్రస్థాయిలో సమావేశం జరిపినట్లు జైట్లీ లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయమై నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. అయితే కేవలం ఆర్థిక సంవత్సరంలోనే మార్పులా.. లేక బడ్జెట్ సమావేశాలను కూడా నవంబర్ నుంచి డిసెంబర్కు మార్చనున్నారా అన్న విషయాలు మాత్రం జైట్లీ వెల్లడించలేదు. ఇప్పటికే కొన్ని దేశాల ప్రభుత్వాలు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా అనుసరిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశంలోనూ ఇదే ప్రక్రియను అనుసరిస్తే ధన ప్రవాహంపెరగడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.