రాష్ట్రంలో ఉన్నత విద్యపై ఇంటింటి సర్వే నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వారు ఎంతమంది, ప్రస్తుతం ఎంతమంది అభ్యసిస్తున్నారనే అంశాలపై ఈ సర్వే చేపట్టనుంది. గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జిఇఆర్) పై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించడం ద్వారా ఉన్నత విద్యను మరింత మందికి అందించాలనే లక్ష్యంతో సర్వే నిర్వహించనుంది.
రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సాంకేతిక కోర్సులతోనే చదువు నిలిపివేయడానికి గల కారణాలను ఈ సర్వే ద్వారా తెలుసుకోనుంది. ప్రస్తుతం ఉన్నత విద్యలో రాష్ట్ర ఎన్రోల్మెంటు 32. 4 శాతంగా ఉంది. రాబోయే మూడేళ్లలో ఎస్రోల్మెంటును శాతానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ స్థాయిలో జిఇఆర్ సగటు తక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని పెంచేలా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేయనుంది.
అందులో భాగంగానే ర్యాపిడ్ హౌస్ హోల్డ్ సర్వేను ఉన్నత విద్యామండలి ద్వారా చేపట్టాలని భావిస్తోంది రాష్ట్రంలో దాదాపు 210 కోట్ల కుటుంబాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని ఈ సర్వే నిర్వహించనుంది. ప్రతి ఇంట్లో ఉన్నవారి సంఖ్యతో పాటు వారి విద్యార్హతలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. విద్యారంగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలతో కూడిన జాబితాను తీసుకుని వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు. ఈ సర్వే కోసం క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.