ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కఠినమైన లాక్డౌన్ విధింపు గురించి హెచ్చరించారు. ఇదే తన "చివరి హెచ్చరిక" గా పరిగణించాలని సూచించారు. రాష్ట్రంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు తమ ప్రాంగణంలో అవసరమైన అన్ని కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. లాక్డౌన్ వంటి కఠినమైన చర్యలను అమలు చేయమని రాష్ట్రాన్ని బలవంతం చేసేలా ప్రవర్తించవద్దని ఆయన పేర్కొన్నారు. షాపింగ్ సెంటర్లు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనల పట్ల అవాంఛనీయమైన వైఖరి ఏర్పడటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్రంలో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూడాలని ఆయన సూచించారు.
"కఠినమైన లాక్డౌన్ విధించాలని ప్రభుత్వాన్ని బలవంతం చేయవద్దు. ఇది చివరి హెచ్చరికగా పరిగణించండి. అన్ని నియమాలను పాటించండి. స్వీయ క్రమశిక్షణ, ఆంక్షల మధ్య వ్యత్యాసం ఉన్నదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి" అని ఠాక్రే పేర్కొన్నారు. తమ ప్రభుత్వం లాక్డౌన్ అమలుకు అనుకూలంగా లేదని, అయితే ప్రజలు సహకరిస్తే బాగుంటుందని ఆయన కోరారు. అక్టోబర్ నుంచి దశలవారీగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన తరువాత చాలా చోట్ల రద్దీపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా నియమాలను పాటించడం లేదని, ఫలితంగా కేసులు బాగా పెరగడానికి కారణమవుతున్నదని చెప్పారు.
మహారాష్ట్రలో శనివారం 15,602 కొవిడ్-19 కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 22,97,793 కు, మరణాల సంఖ్య 52,811 కు చేరుకుంది. గత వారం కేంద్ర బృందం ముంబైని సందర్శించి.. అక్కడి ప్రజలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు మార్గదర్శకాలను పాటించడం లేదని గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. హోటళ్ళు, రెస్టారెంట్లు కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండటం ద్వారానే కరోనాను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని కేంద్ర బృందం సూచించడంతో ముఖ్యమంత్రి ఈ మేరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.