ఒడిశాలో ఓ ఎమ్మెల్యే శాసనసభలో ఆత్మహత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆ రాష్ట్ర సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ అసెంబ్లీలో మాట్లాడుతుండగా.. పోడియం వద్దకు చేరుకున్న బీజేపీ దేవ్గఢ్ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ తాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇతర సభ్యులు ఆయన నుంచి శానిటైజర్ బాటిల్ ను లాక్కున్నారు.
ధాన్యం కొనుగోలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని సదరు ఎమ్మెల్యే ఇది వరకే హెచ్చరించారు. తన నియోజకవర్గమైన దేవ్గఢ్ జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన ఫిబ్రవరి 26న అసెంబ్లీలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారని, ప్రభుత్వం తక్షణం కొనుగోళ్లు చేపట్టకుంటే తాను కూడా అదే పనిచేస్తానని హెచ్చరించారు. శుక్రవారం రెండో విడత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ముందుగా హెచ్చరించినట్టుగానే సుభాష్ ఆత్మహత్యాయత్నం చేశారు.