ఇండోనేషియాలోని జావా దీవిలో బుధవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని ఇస్లామిక్ జూనియర్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు టీచర్లు కలిసి బుధవారం విహారయాత్రకు బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.