ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మనదేశంలోనే నిర్మిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ చీనాబ్ బ్రిడ్జికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భారీ ఉక్కు వంతెన నిర్మాణం పూర్తి కావొచ్చినట్లు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ గురువారం వెల్లడించారు. 476 మీటర్ల పొడవులో విల్లు ఆకారంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఫోటోను ఆయన ట్విటర్ లో షేర్ చేశారు.
దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్ ను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1,315 మీటర్లు. 17 వ్యాసార్థాలల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయం రూ.1,250 కోట్లు. ఇది ఈఫిల్ టవర్ (324 మీటర్లు) కంటే 35 మీటర్ల పొడవు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.