పల్లె పోరులో ఈసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇప్పటివరకూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో మాత్రమే కనిపించే 'నోటా' మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో కూడా స్థానం దక్కించుకుంది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు మాత్రమే బ్యాలెట్ పత్రంలో ముద్రిస్తారు. ఈ బ్యాలెట్ పత్రంలో గుర్తులన్నింటి కంటే చివరన 'నోటా'ను కూడా చేర్చడం విశేషం. సాధారణంగా పంచాయతీ ఎన్నికల కోసం పదహారు గుర్తులతో బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తారు. ఈ విధంగా ముద్రించిన బ్యాలెట్లో అట్టడుగున 'నోటా'కు చోటిచ్చారు.పోటీలో ఉన్న ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు వేసుకోవచ్చు.