విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కేంద్రీకరణ గతంలో ఇబ్బందులు సృష్టించిందని, దాని వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తాయని చెప్పారు. ప్రాంతీయ సమానతల కోసం 3 రాజధానులు అవసరమని గవర్నర్ తెలిపారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలని, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కోసం అన్ని రంగాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఏపీలో కరోనాను ఎదుర్కొని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందినట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో మత పరమైన వివాదాలను సృష్టించడానికి కొందరు కుట్రలు పన్నారని ఆయన చెప్పారు. అయితే, తమ ప్రభుత్వం ఆ కుట్రలను సమర్థంగా అడ్డుకోగలిగిందని తెలిపారు.