గుంటూరులో జిల్లా వినుకొండ మండలం చీకటిగలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద టీఎస్ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు.. గాయపడిన ప్రయాణికులను రక్షించారు. అధికారులకు సమాచారం అందించి క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దానిక ప్రకారం.. బస్సు కామారెడ్డి నుంచి పామూరుకు వెళ్తోంది. అయితే, చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద సమీపంలో పొగమంచు అధికంగా ఉండటంతో ఎదరుగా ఉన్న వాహనాలు కనిపించలేదు. దాంతో ఆర్టీసీ బస్సు.. రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.