బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో తమిళనాడులోని మామళ్లాపురం-కరైకల్ మధ్య తుపాను తీరం దాటొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిపై తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో రైళ్లు, విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఇరు రాష్ట ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించేశాయి. కడలూరుకు తూర్పు ఆగ్నేయంలో 290 కి.మీ దూరంలో నివర్ తుఫాన్ ఉంది.
పుదుచ్చేరికి 300 కి.మీ, చెన్నైకి 350 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజాము వరకు కారైకల్-మామల్లపురం మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా 145 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటక, తమిళనాడులో నేడు, రేపు భారీ వర్షాలు పడతాయని తెలిపారు. బెంగళూరులో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరులో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.